లైసెన్స్‌ తుపాకీతో భార్య, కుమారుడిపై  కాల్పులు 

9 Mar, 2021 08:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బహదూర్‌పురా: కుటుంబ కలహాల నేపథ్యంలో లైసెన్స్‌ తుపాకీతో భార్య, కుమారుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటన కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం..కాలాపత్తర్‌ బిలాల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హబీబ్‌ హష్మీ (52) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసైన హబీబ్‌.. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఇంటి పేపర్లు ఇవ్వాలంటూ భార్య, కుమారుడితో గొడవ పడ్డాడు. పేపర్లు ఇవ్వమంటూ చెప్పడంతో ఆగ్రహించిన హబీబ్‌ ఇంట్లోకి వెళ్లి సాయంత్రం 5.45 గంటలకు లైసెన్స్‌ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు. తృటిలో కాల్పుల నుంచి తప్పించుకున్న కుమారుడు ఉమర్‌ హష్మీ వెంటనే కాలాపత్తర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు హబీబ్‌ హష్మీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు