ప్రియుడితో కలిసి భర్తకు సైనెడ్‌ తాగించి..

29 Nov, 2020 10:46 IST|Sakshi
బ్రహ్మయ్య (ఫైల్‌)

హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు 

వివాహేతర సంబంధమే కారణం 

మృతుడి భార్య, ప్రియుడు కలిసి దారుణానికి పూనుకున్నారు

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

పథకం ప్రకారమే బ్రహ్మయ్య హత్య 

సాక్షి, గుంటూరు: అనుమానాస్పదంగా మృతి చెందిన భాష్యం బ్రహ్మయ్య కేసు మిస్టరీని పెదకూరపాడు పోలీసులు ఛేదించారు. సైనేడ్‌ కారణంగానే మృతి చెందినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మృతుడి భార్య, ప్రియుడు కలసి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేల్చి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ వివరాలు వెల్లడించారు.

పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరు గ్రామంలో హోటల్‌ నిర్వాహకుడు  భాష్యం బ్రహ్మయ్య (45) అనుమానాస్పదంగా మృతి  చెందిన విషయం తెలిసిందే. మృతుడి భార్య సాయికుమారి ప్రియుడు అశోక్‌రెడ్డి కలసి బ్రహ్మయ్యను హతమార్చాలని నిర్ధారించుకొని పథకం వేశారు. హత్య చేసినా నిందితులను ఎవరూ గుర్తించరని భావించి మచిలీపట్నంకు చెందిన తోకడా పవన్‌ కుమార్, షేక్‌ షరీఫ్‌లను రెండు నెలల క్రితం కలసి రూ.10 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌ తీసుకున్న అనంతరం నిందితులు ఇద్దరూ పలుమార్లు రెక్కీ నిర్వహించారు.  చదవండి:  (ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య)

పక్కా పథకం ప్రకారం ఈ నెల 4న బ్రహ్మయ్య హోటల్‌ వ్యర్థాలను గ్రామ శివారులో పడేసేందుకు వెళ్లగా అక్కడే కాపుకాచి ఉన్న నిందితులు బలవంతగా బ్రహ్మయ్యకు సైనేడ్‌ అనే పటాస్‌ ద్రావణం తాగించి హతమార్చారు. బ్రహ్మయ్య హత్యకు ముందు ప్రయోగాత్మకంగా ఓ కుక్కకు సైనెడ్‌ పెట్టి చంపారు. అయితే ఈ కేసు మిస్టరీని ఛేదించిన తుళ్ళూరు డీఎస్పీ, సత్తెనపల్లి రూరల్‌ సీఐ, పెదకూరపాడు ఎస్‌ఐలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో క్రైమ్స్‌ ఏఎస్పీ ఎస్‌వీఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.   చదవండి:  (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!)

మరిన్ని వార్తలు