యజమాని భార్యతో డ్రైవర్‌ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌

26 Feb, 2023 08:14 IST|Sakshi
హత్యకు గురైన కుంచం రామారావు (ఫైల్‌)- భార్య భార్గవి ప్రియుడు- ప్రవీణ్‌ కుమార్‌

కంచికచర్ల(ఎన్టీఆర్‌ జిల్లా): కంచికచర్లలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్య పట్టణంలో కలకలం రేపింది. నందిగామ రూరల్‌ సీఐ ఐవీ నాగేంద్రకుమార్‌ కథనం మేరకు వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన కుంచం రామారావు(47) తన భార్య పిల్లలతో కంచికచర్ల పెద్ద బజారులోని పోస్టాఫీసు రోడ్డులో అద్దెకుంటున్నాడు. రామారావు స్వగ్రామంలో రేషన్‌ డీలర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య భార్గవి కంచికచర్ల మండలం మోగులూరు గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తుంది.

వారికి సంతానం లేకపోవటంతో పదేళ్ల క్రితం రామారావు తమ్ముడు శ్రీను చిన్న కుమార్తె జోహారికను పెంచుకుంటున్నారు. ఐదేళ్ల తర్వాత భార్గవికి సుస్మిత అనే పాప పుట్టింది. రామారావు గతంలో జేసీబీ ఉండేది. దానిపై జుజ్జూరు గ్రామానికి చెందిన మోగులూరు ప్రవీణ్‌కుమార్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలోనే డ్రైవర్‌ ప్రవీణ్‌కుమార్‌ తన యజమాని రామారావు భార్య భార్గవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

అప్పటినుంచి ప్రవీణ్‌కుమార్‌ తరచుగా రామారావు ఇంటికి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్‌ రామారావు ఇంటికి రాగా రామారావు అతడిని మందలించాడు. దీంతో రామారావు భార్య భార్గవి, ఆమె ప్రియుడు ప్రవీణ్, అతని స్నేహితులు మోగులూరు బుజ్జిబాబు, పులి సురేష్‌ కలసి రామారావుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. విషయం గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌ వాహనానికి సమాచారం అందించారు.

ఘటనా స్ధలానికి చేరుకుని వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం  తెల్లవారుజామున 3.35 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సీఐ నాగేంద్రకుమార్, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రామారావు సోదరుడు కుంచం శ్రీను ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: 'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..' 

మరిన్ని వార్తలు