భర్తకు షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన భార్య.. అసలేం జరిగింది?

22 Feb, 2023 09:45 IST|Sakshi

నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా): మద్యం మహమ్మారి మరో కుటుంబాన్ని నిలువునా బలి చేసింది. రోజూ తాగి వచ్చి వేధించే భర్త తీరును భరించలేక ఓ మహిళ ఏకంగా అతడిని హత్య చేసింది. అందుకు తన సోదరుడి సాయం తీసుకుంది. నరసన్నపేట మండలం పెద్దకరగాంలో మంగళవా రం జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకరగాంకు చెందిన ఇర్రి చంద్రభూషణ్‌(37)కు పదేళ్ల కిందట తోటపాలేంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది.

వీరికి మాధురి, లాస్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న చంద్రభూషణ్‌ తాగుడుకు బానిసైపోయాడు. ఇతర వ్యసనాలు కూడా ఉండడంతో నిత్యం భార్యను వేధించేవాడు. ఈ గొడవ గ్రామంలో పెద్ద మనుషుల వరకు కూడా వెళ్లింది. రచ్చబండలో సంప్రదింపులు జరిగా యి. అయినా చంద్రభూషణ్‌లో మార్పు రాలే దు. వారం కిందటే భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. దీంతో భాగలక్ష్మి తన కన్నవారింటికి వెళ్లిపోయింది. రెండు రోజుల కిందటే భర్త వద్దకు వచ్చింది. వచ్చిన రోజు రాత్రి మళ్లీ వివాదం జరిగింది. దీంతో పోలీసులను ఆశ్రయిస్తే వారు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అప్పటికీ చంద్రభూషణ్‌ మారలేదు.

సోదరుడిని పిలిచి.. 
మంగళవారం కూడా తాగి ఇంటికి వచ్చిన చంద్రభూషణ్‌ మళ్లీ భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆమె తన సోదరుడు శివకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచారు. అతను వచ్చాక మద్యం మత్తులో ఉన్న చంద్రభూషణ్‌పై కర్రలు, మంచం కోళ్లతో దాడి చేసి విపరీతంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక చంద్రభూషణ్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే శివ పారిపోకుండా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

సంఘటన తెలు సుకున్న నరసన్నపేట సీఐ డి.రాము, ఎస్‌ఐ సింహాచలంలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికుల నుంచి సేకరించారు. వీఆర్వో గవరయ్య, గ్రామ పెద్దమనుషుల మధ్య శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నరసన్నపేట ఎస్‌ఐ వై.సింహాచలం కేసు నమోదు చేయగా.. సీఐ రాము దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లికి ముందే ప్రేమ.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది   

మరిన్ని వార్తలు