ప్రియుడిపై మోజుతో..

28 Jul, 2020 07:47 IST|Sakshi
మృతి చెందిన ధరణీ ధరన్‌ (ఫైల్‌) అరెస్టయిన ఇద్దరు

దుప్పటితో గొంతు నులిమి భర్తను హతమార్చిన భార్య 

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు 

అన్నానగర్‌: భర్త గొంతు నులిమి హత్య చేసిన భార్య, ఆమె వివాహేతర ప్రియుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. పూందమల్లి సమీపంలోని కాట్టుపాక్కం ఓం శక్తి నగర్‌ కు చెందిన ధరణీ ధరణ్‌ (39), కారు డ్రైవర్‌. ఇతని భార్య భవాని (31). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 22వ తేదీ అప్పుల బాధతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు భవాని పూంద మమల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ప్రకారం పూందమల్లి పోలీసులు ధరణీధరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ధరణీ ధరణ్‌ గొంతు నులిమి హత్య చేయబడినట్లు తేలడంతో భవానిని పోలీసులు విచారణ చేశారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమె సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ వ్యక్తి మృతుడి ఇంటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు భవానిని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను, పుందమల్లికి చెందిన దినేష్‌ (31) ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  

పథకం బెడిసికొట్టడంతో..
పోలీసుల విచారణలో ధరణీ ధరణ్, దినేష్‌ స్నేహితులు. ఇద్దరు కలిసి మద్యం తాగేవారు. తరచూ ధరణీ ధరణ్‌ ఇంటికి దినేష్‌ వచ్చేవాడు. ఈ క్రమంలో భవానితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. దినేష్‌కు ఇది వరకే వివాహమై భార్యను విడిచిపెట్టి ఉంటున్నాడు. భవానితో వివాహేతర సంబంధానికి ధరణీ ధరణ్‌ అడ్డుగా ఉండటం అతన్ని హత్య చేసేందుకు పథకం వేసినట్లు తెలిసింది. గత 21వ తేదీ పురుగుల మందు తీసుకువచ్చిన దినేష్‌ దానిని భవాని ఇంటికి వెళ్లి ఇచ్చాడు. ఆహారంలో కలిపి ఇవ్వమని భవానికి చెప్పాడు. పథకం ప్రకారం ఆ రోజు రాత్రి మత్తులో ఇంటికి వచ్చిన అతనికి భవాని ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చింది.

దాన్ని తిని నిద్రపోయిన ధరణీధరన్‌ మరుసటి రోజు ఉదయం లేచి వాంతులు చేసుకున్నాడు. తర్వాత కాఫీ తాగి మళ్లీ నిద్రించాడు. ఆహారంలో విషం కలిపి ఇచ్చినా భర్త చావక పోవటంతో భవాని దినేష్‌కి సమాచారం ఇచ్చింది.  ఇద్దరు పిల్లలను తాతయ్య ఇంటికి పంపించింది. దినేష్‌ ఇంటికి రాగానే నిద్రపోతున్న ధరణీ ధరణ్‌ దుప్పటితో గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ధరణి ధరణ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా దుప్పటిని రెండు చేతులతో చుట్టి దినేష్‌ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా భవాని నాటకం ఆడింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.  

మరిన్ని వార్తలు