భర్తను అంతమొందించిన భార్య
సాక్షి,నాంపల్లి: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ వివాహిత కట్టుకున్న భర్తను కడతేర్చిన సంఘటన శనివారం హబీబ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మాన్గార్ బస్తీకి చెందిన హోటల్ కార్మికుడు రోషన్(23)కు అదే బస్తీకి చెందిన లతకు గత కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. లతకు అదే బస్తీకి చెందిన యువరాజు(28) అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది.
భర్త రోషన్ ఇంట్లో లేని సమయంలో యువరాజుతో లత సన్నిహితంగా ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాక వీరి బంధానికి భర్త రోషన్ అడ్డువస్తున్నాడని భార్య గ్రహించింది. యువరాజు, లత శనివారం మధ్యాహ్నం ఏకాంతంగా ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా భర్త ప్రత్యక్షం కావడంతో ఏం చేయాలో తోచక ప్రియుడు యువరాజుతో కలిసి కత్తితో పొడిచి చంపింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న రోషన్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి రక్త నమూనాలను సేకరించారు. ఇదిలా ఉండగా ప్రియుడు యువరాజ్కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.