దారుణం: తల్లి, భార్య కలసి గొంతు పిసికి చంపారు

12 Jun, 2022 13:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,వర్గల్‌ (గజ్వేల్‌): తాగుడుకు బానిసై నిత్యం భార్య, తల్లిని హింసిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం వర్గల్‌ మండలం మల్లారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మల్లారెడ్డిపల్లికి చెందిన నారెడ్డి రవీందర్‌రెడ్డి (36)కి భార్య రజిత, తల్లి లక్ష్మి, పన్నెండేళ్లలోపు యుగంధర్‌రెడ్డి, గగన అనే ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం నుంచి తాగుడుకు బానిసైన రవీందర్‌రెడ్డి ప్రతిరోజు తాగి భార్యను, తల్లిని, పిల్లలను  తిడుతూ, కొడుతూ హింసించేవాడు. పలుమార్లు పంచాయతీ పెట్టి మందలించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు.

శనివారం ఉదయం కూడా తాగిన మైకంలో తన తల్లిని, భార్యను తిట్టి కొట్టి గొడవపడ్డాడు. దీంతో అతని హింసలు భరించలేక తల్లి లక్ష్మి, భార్య రజిత ఇంట్లోని ఓ గదిలో రవీందర్‌రెడ్డిని గొంతు పిసికి హతమార్చారని మృతుడి మేనమామ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపారు. ఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని సీఐ కమాలాకర్, సంపత్‌కుమార్‌ పరిశీలించారు. మృతుని మెడపై, కాలు వద్ద గాయాలున్నాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

మరిన్ని వార్తలు