బైక్‌ కొనివ్వలేదన్న కోపంతో దారుణం 

5 Sep, 2020 13:06 IST|Sakshi
భర్త చేతిలో హతమైన బోయ కొట్టం లక్ష్మీ

సాక్షి, పామిడి: అదనపు కట్నంలో భాగంగా ద్విచక్ర వాహనం కొనివ్వలేదన్న నెపంతో ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని నెమళ్ళపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలమేరకు... వజ్రకరూరు మండల కేంద్రానికి చెందిన చిక్కన్నయ్య, రమణమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీ (26)ని 11 నెలల క్రితం మండలంలోని నెమళ్ళపల్లికి చెందిన కొట్టం సుబ్బరాయుడికిచ్చి పెళ్లి చేశారన్నారు. కట్నకానుల కింద 6 తులాల బంగారు, రూ.50 వేలు ఇచ్చి వివాహం చేశారని చెప్పారు. పెళ్లి అయినప్పటికీ.. భార్య అంటే సుబ్బరాయునికి ఇష్టం ఉండేది కాదన్నారు. దీనికితోడు ఏడు నెలల నుంచి అదనపు కట్నం కింద బైక్‌ కొనివ్వాలంటూ భర్త సుబ్బరాయుడు తన భార్య లక్ష్మీని వేధించేవాడన్నారు. ఇదే సమయంలో సుబ్బరాయుడుతో పాటు అతని తల్లి రాజమ్మ, అన్నలు లింగమయ్య, సుంకప్ప కలిసి లక్ష్మీని మరింత వేధింపులకు గురి చేసేవారని పేర్కొన్నారు.

అయితే లక్ష్మీ తల్లిదండ్రులు మాత్రం  కుమార్తెకు సర్దిచెప్పి కాపురానికి పంపేవారన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నిద్రపోతున్న భార్య లక్ష్మీని భర్త సుబ్బరాయుడు గొంతునులిమి చంపేశాడని చెప్పారు. అనంతరం సుబ్బరాయుడు.. లక్ష్మీ  తల్లిదండ్రులకు ఫోన్‌చేసి లక్ష్మీ నిద్రమాత్రలు మింగిందని, పామిడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నట్లు సమాచారం ఇచ్చాడన్నారు. వారు ఆసుపత్రికి వచ్చి చూడగా లక్ష్మి గొంతు, మెడపై గాయాలతో చనిపోయి ఉండటాన్ని గమనించారని తెలిపారు. దీంతో మృతురాలి తల్లి రమణమ్మ...  అల్లుడు సుబ్బరాయుడు, అతని తల్లి రాజమ్మ, అన్నలు లింగమయ్య, సుంకప్ప నలుగురు కలిసి తన కుమార్తెను గొంతు నులిమి చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.   

మరిన్ని వార్తలు