భర్త భారీ అప్పులు, మాట్లాడదామని పిలిచి మహిళపై దారుణం

13 Apr, 2021 08:41 IST|Sakshi

భర్త చేసిన అప్పులకు భార్య బలి 

సైదాబాద్‌లో మహిళ దారుణ హత్య 

సాక్షి, సైదాబాద్‌: భర్త చేసిన అప్పులకు భార్య బలైంది. సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో సోమవారం రాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. లోకాయుక్త కాలనీలోని నయాగ్రా అపార్ట్‌మెంట్స్‌లో మంజు (45) పిల్లలతో కలిసి  నివాసముంటోంది. ఆమె భర్త పరిమళ్‌ అగర్వాల్‌ అప్పులు చేసి ఏడాది నుంచి ఇంటికి రావడం మానేశాడు. మంజు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషిస్తోంది.

భర్త చేసిన అప్పులు చెల్లించాలని అప్పిచ్చిన వారు నిత్యం గొడవ చేసేవారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో అయిదుగురు వ్యక్తులు ఆమెతో గొడవపడ్డారు. మాట్లాడుకుందామని అపార్ట్‌మెంట్‌ బయటకు వెళ్లారు. వారితో మంజు మాట్లాడే సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో వారు పరారయ్యారు. సమాచారం తెలియడంతో జాయింట్‌ సీపీ చౌహాన్, డీసీపీ రమేష్, ఏసీపీ వెంకటరమణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.    

మరిన్ని వార్తలు