ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్‌..

2 Nov, 2022 07:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పలమనేరు/పెద్దపంజాణి(చిత్తూరు జిల్లా): కట్టుకున్న భార్యే తనభర్తకు విలనైంది. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్‌వేసి తెలివిగా అంతమొందించింది. ఆపై ఏమీ తెలియనట్టు బంగారు నగల కోసం దొంగలు హత్య చేశారంటూ డ్రామా ఆడింది. నియోజకవర్గంలోని పెద్ద పంజాణి మండలం, తుర్లపల్లి సమీపంలో సోమవారం రాత్రి దామోదర్‌(25) దారుణ హత్యకుగురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
చదవండి: పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..

పెద్దపంజాణి మండలం, పెనుగొలకలకు చెందిన చంద్రమోహన్‌ కుమార్తె అనురాధ, పుంగనూరు మండలం, బత్తలాపురానికి చెందిన రెడ్డెప్ప కుమారుడు దామోదర్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. అత్తారింట్లో నోముల పండగకు దంపతులు వచ్చి స్వగ్రామానికి బైక్‌పై భార్యాభర్తలు తిరుగు ప్రయాణంలో దామోదర్‌ను కత్తులతో పొడిచి చంపారు. అయితే కళ్లలో కారంపొడి కొట్టి దొంగలు నగల కోసమే హత్య చేశారంటూ మృతుని భార్య అనురాధ పోలీసులకు తెలిపింది.

అందరూ నిజమేననుకున్నారు. అయితే ఆమె తండ్రి గ్రామంలో పాల సెంటర్‌ను నిర్వహించేవాడు. అక్కడికి పాలను తీసుకెళ్లేందుకు పెద్దపంజాణి మండలం, తిరుమలకొండయ్యగారిపల్లికి చెందిన గంగరాజు(25) పాల ఆటో డ్రైవర్‌గా వచ్చేవాడని తెలిసింది. అప్పటి నుంచే అనురాధ, గంగరాజు మధ్య చనువుందని సమాచారం. వీరికి భర్త అడ్డుగా ఉండడంతో పక్కా స్కెచ్‌తో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. అనురాధ ఇచ్చిన సమాచారంతోనే గంగరాజు దారిమధ్యలో వేచి ఉండి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇప్పటికే పోలీసులు మృతిని భార్య అనురాధ, పాల ఆటో డ్రైవర్‌ గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని సమాచారం. కేసులో పూర్తి వివరాలు తెలిశాక నిందితులను నేడో, రేపో పోలీసులు అరెస్ట్‌ చూపనున్నట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు