భార్య చేతిలో భర్త హతం; తల్లినే క్రూరంగా చంపాడు..

23 Feb, 2021 14:59 IST|Sakshi

న్యూఢిల్లీ: తాగుడుకు అలవాటు పడితే ఆ మైకంలో ఏం చేస్తారో వారికే తెలియదు. తాగుడుకు బానిసై తమను అశ్రద్ధ చేస్తున్నాడని భార్య కట్టుకున్న భర్తనే చంపగా, తాగటానికి డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి కన్నతల్లినే కడతేర్చాడు. ఈ రెండు వేర్వేరు ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఫతేపూర్‌కు చెందిన సరితాదేవి, సికిందర్‌ సహని భార్యాభర్తలు. సికిందర్‌కు పూటుగా మద్యం తాగే అలవాటు ఉంది. ప్రతి రోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. పిల్లలముందే నోటికొచ్చినట్లు తిట్టేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడు మరోసారి తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన సరిత, చీర తీసుకుని మత్తులో ఉన్న భర్త మెడకు బిగించింది. దీంతో అతడు ఊపిరాడక ప్రాణాలు వదిలాడు.

ఆమె వెంటనే తన భర్తను సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే మెడపై కొన్ని గుర్తులు ఉండటంతో హత్య అని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీసీపీ అతుల్‌ ఠాకుర్‌ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని ప్రశ్నించారు. ఆమె పొంతన లేని మాటలు మాట్లాడటంతో ఇది హత్యేనన్న అనుమానం మరింత బలపడింది. దీంతో మృతదేహానికి ఫోరెన్సిక్‌ నిపుణులతో పరీక్షలు చేయించారు. ఆ తర్వాత సరితను తమదైన శైలిలో విచారించగా, భర్త తాగుడుకు బానిసవ్వడం, ఏ పని చేయకపోవడం వల్లే హత్య చేసినట్లు అంగీకరించింది.

 తాగడానికి డబ్బులివ్వలేదని..
ఢిల్లీలోని నార్త్‌ ఈస్ట్‌లో 64 ఏళ్ళ వృద్దురాలిని ఆమె కొడుకు హత్యచేశాడు. తాగడానికి డబ్బులివ్వాలని సుశీల్‌ పాండే తన తల్లి లల్లిదేవిని బలవంతపెట్టాడు. ఆమె డబ్బులివ్వడానికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన అతడు స్ర్కూడ్రైవర్‌ తీసుకొని తల్లిని క్రూరంగా హత్యచేశాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు సుశీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

చదవండి: దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి

మరిన్ని వార్తలు