బావతో వివాహేతర సంబంధం.. దుబాయ్‌ నుంచి భర్త రావడంతో..

21 Nov, 2022 08:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరీంనగర్: కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్‌(30)ను అతని భార్యే తన ప్రియుడితో కలిసి చంపిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ ఆర్‌.ప్రకాశ్, మల్యాల సీఐ డి.రమణమూర్తి, ఎస్సై కె.వెంకట్రావ్‌ వెల్లడించారు. దేశాయిపేటకు చెందిన వేముల ప్రమీలకు కొడిమ్యాలవాసి బత్తుల శ్రీనుతో పదేల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. ఉపాధి నిమిత్తం శ్రీను కొన్నేళ్లు దుబాయ్‌ వెళ్లాడు. 

ఈ క్రమంలో తనకు బావ వరుస అయిన దేశాయిపేటకు చెందిన సూర రాజేశ్‌తో ప్రమీల అక్రమ సంబంధం పెట్టుకుంది. శ్రీను దుబాయ్‌ నుంచి వచ్చాక కూడా దీన్ని కొనసాగించింది. ప్రమీల తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ విషయమై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. శ్రీను మద్యానికి బానిసయ్యాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతన్ని హత్య చేయాలని ప్రమీల, రాజేశ్‌తోపాటు ప్రమీల తల్లిదండ్రులు రాజవ్వ, రాజనర్సు పథకం వేశారు. దీర్ఘకాలిక వ్యాధికి రాజవ్వ వాడుతున్న ట్యాబ్లెట్లను ప్రమీల పొడిగా చేసింది.

 ఈ నెల 11న శ్రీను తాగే మద్యంలో కలిపింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతన్ని ప్రమీల, రాజేశ్‌లు టవల్‌తో గొంతు బిగించి, చంపారు. అనంతరం మృతదేహా న్ని చీరతో దూలానికి ఉరివేసి, పారిపోయారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శ్రీనును చంపింది అతని భార్య, ఆమె ప్రియుడు, తల్లిదండ్రులేనని తేల్చారు. ఆదివారం ఆ నలుగురిని అ రెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన టవల్, ట్యాబ్లెట్‌ షీట్లతోపాటు, బైక్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు