మాస్క్‌ ధరించకుండా షాపింగ్‌.. సిబ్బందిపై ఆగ్రహం

20 May, 2021 11:06 IST|Sakshi

బెంగళూరు: కరోనా సోకకుండా ప్రాథమికంగా ధరించాల్సింది మాస్క్‌. కానీ ఇది ధరించడంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మాస్క్‌ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే మాస్క్‌ కొన్ని చోట్ల వివాదానికి దారి తీస్తోంది. తాజాగా ఒక మాల్‌లో మాస్క్‌ కోసం పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనలో వైద్యుడిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని మంగళూరులో ఓ మాల్‌కు వైద్యుడు వెళ్లాడు. అయితే మాస్క్‌ పెట్టుకోకుండా బిల్‌ చేయించేందుకు వస్తువులు తీసుకొచ్చారు. ఆయన మాస్క్‌ ధరించకపోవడాన్ని గమనించిన మాల్‌ సిబ్బంది అతడిని ప్రశ్నించారు. మాస్క్‌ ధరించాలని సూచించారు. దీంతో ఆ వైద్యుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చూసి మేనేజర్‌ రాగా అతడితో కూడా వైద్యుడు గొడవ పడ్డాడు. తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు ఆయన మాస్క్‌ ధరించకుండానే షాపింగ్‌ పూర్తి చేసుకుని బయటపడ్డాడు. మాస్క్‌ తప్పనిసరి అనే నిబంధనను ఆ వైద్యుడు ‘వెధవ రూల్‌ (ఫూలిష్‌ రూల్‌)’ అని మండిపడ్డాడు.

ఈ ఘటనపై మాల్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శశికుమార్‌ తెలిపారు. అయితే ఈ ఘటన మే 18వ తేదీన జరగ్గా తాజాగా బహిర్గతమైంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది. వాగ్వాదం చేసిన వైద్యుడు ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నాడని ఆ గొడవలో చెప్పాడు. కరోనా బారినపడిన మీరే మాస్క్‌ ధరించకుంటే ఎలా అని మాల్‌ సిబ్బందితో పాటు సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

చదవండి: ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌పై ‘ఫంగస్‌’ దాడి
చదవండి:  లాక్‌డౌన్‌ నిబంధనలు గాలికి

మరిన్ని వార్తలు