గాయాలపాలైన సచివాలయ సిబ్బంది

4 Aug, 2021 08:56 IST|Sakshi
సచివాలయ సిబ్బందిపై దాడి చేస్తున్న వ్యక్తులు

తిరుపతి తుడా: మాస్కులు ధరించకపోవడంతో రూ.100 జరిమానా విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం మత్తులో కొందరు సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక అమెరికన్‌ బార్‌ సమీపంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడి చర్యల్లో భాగంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

దాడిలో పగిలిపోయిన ప్రభుత్వ ఫోన్‌
తిరుపతిలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కమిషనర్‌ గిరీషా ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది రంగంలోకి దిగారు. మాస్కులు లేకుండా ముగ్గురు ప్రజల మధ్య తిరుగుతుండడం గుర్తించి మాస్కు ధరించాలని సచివాలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. దీంతో రూ.100 జరిమానా విధిస్తామని చెప్పడంతో ఆ ముగ్గురూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంమత్తులో ఉన్న వారు సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశారు. జరిమానా విధించే ప్రభుత్వ మొబైల్‌ను లాక్కొని నేలకేసి కొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. శానిటరీ సెక్రటరీ, ఇన్‌స్పెక్టర్‌ తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధితులు అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు