మహిళ దుస్తులు చింపి, అనుచిత దాడి...కాదు దోపిడి అంటున్న యజమాని

25 Sep, 2022 14:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒక క్లబ్‌లోని బౌన్సర్లు ఒక మహిళ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. సదరు మహిళ బట్టలు చింపి, దారుణంగా దాడి చేశారు. దీంతో సదరు మహిళ ఇద్దరు బౌన్సర్లు తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదులు చేసింది. సెప్టంబర్‌ 18న ఢిల్లీలోని సౌత్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... సదరు బాధిత మహిళ నుంచి తమకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని తెలిపారు.

తాము సంఘటన స్థలానికి వచ్చేటప్పటికీ మహిళ దుస్తులు చిందరవందరగా ఉన్నట్లు గుర్తించామన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌కి తరలించామని తెలిపారు. అలాగే సదరు క్లబ్‌లోని బౌన్సర్ల వివరాలను సేకరించడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ స్నేహితులతో కలిసి క్లబ్‌కి వచ్చానని, ఎంట్రీపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో బౌన్సర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

కానీ విచారణలో క్లబ్‌ యజమాని సురేంద్ర్‌ సింగ్‌ చౌదరి మరో కథ చెబుతన్నాడు. తాము ప్రతినెల స్థానిక పోలీస్‌ సిబ్బందికి దాదాపు రూ. 5 లక్షలు చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. ఐతే తాను చెల్లించడానికి ప్రస్తుతం నిరాకరించడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోడియం వద్ద నుంచి బలవంతంగా సుమారు రూ. 1.5 లక్షలు తీసుకుని పోలీసులకు ఫోన్‌ చేశారని తెలిపాడు.

చచ్చిన ఆ  పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, ఇవ్వకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారని వివరిస్తూ..స్పెషల్‌ సీపీకి లేఖ రాశాడు. అలాగే పోలీసులు తమ క్లబ్‌ సిబ్బందిలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాదు సదరు క్లబ్‌ యజమాని తమ క్లబ్‌లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. 

(చదవండి: ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం)

మరిన్ని వార్తలు