అయ్యో తల్లి: పొత్తిళ్లలోని పాపాయిని కొట్టి, కాళ్లతో తొక్కి

3 Jul, 2021 18:26 IST|Sakshi

లక్నో: వద్దు..! నాకు అబ్బాయే కావాలి. అమ్మాయి వద్దంటూ అప్పుడే పుట‍్టిన పసికందుపై తల్లి రాక్షసంగా ప్రవర‍్తించింది. పొత్తిళ్లలోని పాపాయిని గోడకేసి కొట్టింది. అంతటితో ఆగలేదు. ఆ నొప్పి తాళలేక గుండెలవిసేలా ఏడుస‍్తున్న పసికందును కనికరం లేకుండా కాళ్లతో తొక‍్కింది. జననాంగ భాగాల‍్ని తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా..పేగు తెంచుకొని జన్మనిచ్చిన పసిపిల్లను తన చేతులతో తానే చంపేందుకు ప్రయత్నించిన ఆ తల్లికి చేతులెలా వచ్చాయోనని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు. 

 పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్ లోని నందిగ్రామ్‌కు చెందిన ఓ మహిళకు గతేడాది వివాహం జరిగింది. అయితే గర్భిణీగా ఉన్న ఆమె ఈ ఏడాది జూన్‌ 21న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో తనకు ఆడపిల్ల పుట‍్టిందని జీర్ణించుకోలేకపోయింది. భర్త, అత్తమామలు మనకు దుర్గమ్మ పుట్టి, లక్ష్మీదేవి పుట్టిందని ఓదార్చే ప్రయత‍్నం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కుటుంబ సభ‍్యులు పాపాయికి ఏం పేరుపెడితే బాగుటుందోనని తెలుసుకునేందుకు పక్కనే ఉన్న పూజారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తల్లి.. పసికందుపై దారుణానికి ఒడిగట్టింది. విచక్షణా జ్ఞానం మరిచి తీవ్రంగా గాయపరిచింది. కిందపడేసి కాళ్లతో తొక్కుతు రాక్షసానందం పొందింది. అయితే ఈ దాడి జరిగే సమయంలో ఇంట్లో పిల్లలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దారుణానికి ఒడిగట్టిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  
చదవండి: ఫోన్‌ మాట్లాడుతూ..60 అడుగుల లోతైన బావిలోపడి

మరిన్ని వార్తలు