మరదలిపై బావ దాడి 

18 Jan, 2021 09:06 IST|Sakshi

సాక్షి, కాకుమాను: వివాహతేర సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎస్‌.సుందర్‌ రాజన్‌ తెలిపిన వివరాల మేరకు... జిల్లాలోని యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత (28) అనే మహిళకు కొంత కాలం క్రితం కానీషా అనే వ్యక్తితో వివాహమైంది. యడ్లపాడుకే చెందిన వేణుగోపాల్‌ అనే వ్యక్తితో సునీతకు వివాహేతర బంధం ఏర్పడింది.  ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారి బంధం కొనసాగించేందుకు వీలు లేకపోవటంతో ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కాకుమాను శివారులోకి వెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని వేణుగోపాల్‌ ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి సునీత మృతి చెందగా వేణుగోపాల్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. వేణుగోపాల్‌ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చస్తున్నారు.

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో మరదలిపై బావ దాడి చేయడంతో, మరదలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. జరిగిన ఈ ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిశేషు అనే వ్యక్తి పెన్షన్‌ డబ్బులు విషయంలో పెద్దకొడుకు శివశంకర్‌ తనకు కావాలని అడుగుతుండగా, తండ్రి మాత్రం చిన్న కొడుక్కు ఇస్తానని చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న శివశంకర్‌ ఇదంతా మరదలే చేస్తుందని భావించి జొన్నా గీతాసురేఖపై అసభ్యంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన గీతా సురేఖ ఇంట్లో ఉన్న గ్‌లైసిల్‌ మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన మామ బాధితురాలిని ఆసుపత్రికి తరలించాడు. జరిగిన ఈ ఘటనపై గీతాసురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని వార్తలు