దారుణం: ట్రాక్టర్‌తో తొక్కించి హతమార్చారు

30 Oct, 2020 13:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరి ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం

ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న ఆరోపణలతో అత్తింటి వారు ఓ మహిళను, ఆమె ప్రియుడిని హతమార్చారు. ట్రాక్టర్‌ చక్రాల కింద తొక్కించి అత్యంత పాశవికంగా హత్యచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. వివరాలు.. జల్నా జిల్లాకు చెందిన మరియా అనే మహిళ(32)కు చపల్‌గావ్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. పదేళ్ల క్రితమే భర్త మరణించడంతో అప్పటి నుంచి అత్తింట్లోనే ఉంటూ జీవితం గడుపుతోంది. 

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వివాహితుడైన హర్బక్‌ భగవత్‌(27)తో మరియాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఆమె అత్తింటి వారు ఇద్దరిని మందలించారు. ఇలాంటి పనులు మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినప్పటికీ భగవత్‌, మరియా వైఖరిలో ఎలాంటి మార్పురాకపోగా, మార్చి 30న ఇద్దరూ కలిసి గుజరాత్‌కు పారిపోయారు. దీంతో మరియా కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 22న వారి జాడ కనుక్కొని పోలీసులు, మహారాష్ట్రకు తీసుకువచ్చారు.(చదవండి: షాకింగ్‌: రోడ్డుపై దారుణ హత్య.. ఆపై) 

ఇక అప్పటి నుంచి వీరిద్దరు తమ గ్రామంలోనే సహజీవనం మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన మరియా మామ బాత్వెల్‌ సంపత్‌ లాల్జరే, అతడి కొడుకు వికాస్‌ లాల్జరే ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించారు. అక్టోబరు 28న మరియా, భగవత్‌ మోటార్‌ సైకిల్‌పై పక్క ఊరికి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను వాళ్ల మీదకు ఎక్కించగా.. టైర్ల కింద పడి తీవ్రగాయాలపాలయ్యారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే మృతి చెందారు. ఈ ఘటనపై భగవత్‌ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను, మరియాను వికాస్‌, సంపత్‌ కలిసి ఉద్దేశపూర్వకంగానే హత్యచేశారని ఆరోపించింది. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేసి, హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. (చదవండితమ్ముడి ప్రేమ.. అల్లుడిని హత్యచేసిన అత్త)

మరిన్ని వార్తలు