ఘోరం: వాళ్లిద్దరికీ గుండు కొట్టించి..

27 Aug, 2020 10:57 IST|Sakshi

యూపీలో వితంతువు, దివ్యాంగుడికి తీవ్ర అవమానం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వితంతువు, దివ్యాంగుడైన పురుషుడిపై స్థానికులు అత్యంత హేయంగా దాడి చేశారు. శిరోముండనం చేసి చెప్పుల దండ వేసి తీవ్రంగా అవమానించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాలు.. యూపీలోని కనౌజ్‌ జిల్లాకు చెందిన బాధితురాలి(37) భర్త రెండు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అప్పటి నుంచి దివ్యాంగుడైన ఓ నలభై ఏళ్ల వ్యక్తి సదరు మహిళకు సహాయంగా ఉంటూ స్నేహం కొనసాగిస్తున్నాడు. (చదవండిభర్తను భుజాలపై మోయాలంటూ..)

అయితే వీరి మధ్య ఉన్న బంధం బాధితురాలి బంధువులకు ఎంతమాత్రం నచ్చలేదు. భర్త చనిపోయిన తర్వాత పరాయి మగవాడితో చనువుగా ఉంటూ తమ పరువు తీస్తోందని భావించారు. దీంతో వాళ్లిద్దరికీ ఎలాగైనా బుద్ధిచెప్పాలనుకున్నారు. ఈ క్రమంలో బుధవారం వాళ్లిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో నెమ్మదిగా అక్కడికి చేరుకున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. బాధితులకు గుండు కొట్టించారు. అనంతరం ముఖానికి నల్లరంగు పూసి, చెప్పుల దండ మెడలో వేసి వీధుల గుండా ఊరేగించారు. ఈ తతంగాన్నంతా కొంతమంది సెల్‌ఫోన్‌లో వీడియో తీయడంతో ఈ అమానుష చర్య వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. (చదవండిస్కాలర్‌షిప్‌ దరఖాస్తు కోసం వెళ్లిన బాలికపై అకృత్యం)

మరిన్ని వార్తలు