ముగ్గురు కూతుళ్లను హతమార్చిన తల్లి!

17 Oct, 2020 17:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వియన్నా: ముగ్గురు కూతుళ్లను చంపిన ఓ తల్లి, ఆ తర్వాత తనను తాను అంతం చేసుకునేందుకు సిద్ధమైంది. కానీ అంతలోనే మనసు మార్చుకుని, స్వల్ప గాయాలతో బయటపడింది. చేసిన నేరాన్ని అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ ఘటన ఆస్ట్రియా రాజధాని వియన్నాలో చోటుచేసుకుంది. వివరాలు.. డొనాస్టడ్‌ జిల్లాకు చెందిన మహిళకు తొమ్మిది, మూడేళ్ల వయస్సు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమె మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. (చదవండి: బాత్‌రూంలో ప్రసవం.. బిడ్డను విసిరేసింది)

ఈ క్రమంలో శనివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌ చేసి తమ ఇంటికి రావాల్సిందిగా కోరింది. తన కుమార్తెలను చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వారికి చెప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితురాలి ఇంటికి బయల్దేరారు. రక్తపు మడుగులో ఉన్న పడి ఉన్న బాలికల మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. నిందితురాలికి కూడా గాయాలు అయ్యాయని, ఆమె కోలుకున్న తర్వాతే విచారణ జరుపుతామని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు