పేరొందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో మంచి హోదా.. ఉద్యోగాలు పెట్టిస్తానంటూ

31 Mar, 2022 14:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.24 లక్షలు వసూలు

మహిళ రిమాండ్, పరారీలో ముగ్గురు   

సాక్షి, ఉప్పల్‌: తాను ఒక పేరొందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో మంచి హోదాలో ఉన్నానంటూ మాదాపూర్, బెంగళూర్‌లో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ అమాయక నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు దండుకున్న మహిళను ఉప్పల్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ గోవిందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన చంద్రగుంట లలిత పరమేశ్వరి (26), ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ రామంతాపూర్‌ శ్రీనివాసపురంలో ఉంటుంది. ఈమెతో పాటు తిరుపతిలో నివాసముండే ప్రసాద్, కూకట్‌పల్లికి చెందిన రామ్, బెంగళూరుకు చెందిన మనోజ్‌ శర్మలు కలిసి ముఠాగా ఏర్పడ్డారు.

రామంతాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆరుగురి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దాదాపుగా రూ. 24 లక్షల వరకు వసూలు చేశారు. రేపు మాపంటూ నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి పంపారు. తీరా అక్కడికెళ్లగా అసలు విషయం బయటపడింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఈ నెల 29న ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు సూత్రధారి అయిన లలిత పరమేశ్వరిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  
చదవండి: ‘ఒంటరిగా ఉన్నాను ఇంటికిరా’.. అంటూ పిలిచి మహిళ నిలువుదోపిడి

మరిన్ని వార్తలు