తండ్రిని బతికించుకునేందుకు... చిన్నారిని బలివ్వబోయింది!

13 Nov, 2022 05:50 IST|Sakshi

న్యూఢిల్లీ: మూఢ నమ్మకాల మాయలో ఓ పాతికేళ్ల మహిళ ఒక పసికందునే బలివ్వబోయిన దారుణం ఢిల్లీలో వెలుగుచూసింది. ఇటీవల కన్నుమూసిన తండ్రి నవజాత మగ శిశువును బలిస్తే బతికొస్తాడని ఎవరో చెప్పడంతో ఇంతటి ఘోరానికి పాల్పడబోయింది. మామ్‌రాజ్‌ మొహల్లా దగ్గర నివసించే దంపతులకు రెండు నెలల బాబున్నాడు. శ్వేత అనే పాతికేళ్ల మహిళ వారితో పరిచయం పెంచుకుంది. ఎన్‌జీవోలో పనిచేస్తానని, పిల్లాడికి ఉచితంగా మందులిస్తానని నమ్మబలికి ఇంటికి రోజూ వచ్చిపోతూ దగ్గరైంది.

బుధవారం పిల్లాడిని సరదాగా తిప్పుతానంటూ బయటకు తీసుకెళ్లింది. వెంట వచ్చిన పసికందు బంధువుకు క్రూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి వదిలించుకుని బాబుతో పరారైంది. బంధువు బాబు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా శ్వేత జాడ కనిపెట్టారు. ఆమెను అరెస్ట్‌చేసి పసికందును తల్లిదండ్రులకు అప్పజెప్పారు. బాలున్ని కాపాడుతూ కేసును 24 గంటల్లోపే చేధించిన పోలీసులకు ప్రశంసలు దక్కాయి.

మరిన్ని వార్తలు