తెలిసిన వ్యక్తి ఇంటికి వచ్చాడని అన్నం పెడితే.. చివరకు!

25 Jul, 2021 08:19 IST|Sakshi

సాక్షి, చిగురుమామిడి(కరీంనగర్‌): మండలంలోని బొమ్మనపల్లి యువతి హత్యతో ఉలిక్కిపడింది. శుక్రవారం మధ్యాహ్నం మ్యాదర ప్రణాళిక గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. గడిచిన 30 ఏళ్లలో హత్యా సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. కానీ ఈ హత్యతో గ్రామప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతిని పథకం ప్రకారమే హత్యచేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

రెండు నెలల క్రితమే పెళ్లై పసుపుపారాణి ఆరకముందే ఇలా జరగడం గ్రామంలో చర్చనీయాంశమైంది. హత్యకు దారితీసిన పరిస్థితులు ఎవరికీ అంతుబట్టడం లేదు. తెలిసిన వ్యక్తి ఇంటికి వచ్చాడు అన్నంపెట్టి మర్యాద చేద్దామనుకుంటే చివరికి ప్రాణం పోయే పరిస్థితి దాపురించడంపై గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

సీసీ కెమెరాలు లేకపోవడం 
రెండున్నరేళ్ల క్రితం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు అప్పటి ఎస్సై సత్యనారాయణకు గ్రామస్తులు విరాళాలు అందించారు. ప్రణాళిక ఇంటి సమీపంలోని కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేయలేదు. ఒక వేళ  సీసీ కెమెరా ఉంటే హంతకులను ఈజీగా పోలీసులు పట్టుకునేందుకు అవకాశం ఉండేది. ఏదిఏమైనా ప్రణాళిక హత్యతో ఇళ్లలో మహిళలను ఒంటరిగా ఉంచాలనే ఆలోచన తల్లిదండ్రుల్లో భయాన్ని కలిగిస్తోంది.   

మరిన్ని వార్తలు