భర్తను హతమార్చి కరోనా పేరుతో నాటకం..!

27 May, 2021 06:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోలీసులకు చిక్కిన కిలాడీ భార్య 

సాక్షి, చెన్నై: భర్తను హతమార్చడమే కాకుండా, శ్వాస ఆడకుండా కరోనాతో మరణించినట్టుగా ఓ భార్య నాటకాన్ని రక్తి కట్టించింది. అయితే, మృతుడి సమీప బంధువు హఠాత్తుగా ఆస్పత్రిలో ప్రత్యక్షం కావడంతో ఆ భార్య గుట్టు రట్టయ్యింది.  ఈరోడ్‌జిల్లా గోబి చెట్టి పాళయం సమీపంలోని కుమార పాళయంకు చెందిన శ్రీనివాసన్‌ స్థానికంగా సెలూన్‌ దుకాణం నడుపుతున్నాడు.

ఆయనకు భార్య ప్రభా, పదేళ్ల కుమార్తె ఉంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం తన భర్తకు శ్వాస ఆడడం లేదని, కరోనా వచ్చినట్టుగా ఉందంటూ రోదించింది. ఇరుగు పొరుగు వారి సాయం కోరింది. కరోనా భయంతో ఇరుగురు పొరుగు వారు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చివరకు ఓ ఇద్దరు వ్యక్తులు ఆమెకు సహకరించారు. సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కాగా శ్రీనివాసన్‌ను పరీక్షించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. దీంతో తనతో వచ్చిన ఇద్దరి వ్యక్తుల సాయంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే యత్నం చేసింది. అదే సమయంలో ఆ ఆస్పత్రి వద్ద శ్రీనివాసన్‌ సమీప బంధువు ఒక రు ప్రత్యక్షం కావడంతో ప్రభాలో ఆందోళన బయలుదేరింది. శ్రీనివాసన్‌ను క్షుణ్ణంగా పరీక్షించిన ఆ బంధువు మెడ భాగంలో గాయం ఉండటాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో ఆమెతో పాటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. పోలీసులు జరిపిన విచారణలో ఆమె తన భర్తను ఇద్దరు ప్రియులు సెలూన్‌ శరవణకుమార్, పొరోటా వెల్లింగిరితో  కలసి భర్తను చంపి నాటకం ఆడినట్లు నిర్ధారించారు. లాక్‌డౌన్‌ సమయంలో తన భార్య ప్రభా ఎవరితోనో పదేపదే ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసిన శ్రీనివాసన్‌ మందలించడం వల్లే.. ఆమె  ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.
చదవండి: జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ

మరిన్ని వార్తలు