20 సెంట్ల కోసం రెండు ప్రాణాలు బలి 

6 Nov, 2020 10:01 IST|Sakshi
చండి బిడ్డతో సుమతి (ఫైల్‌), సుజాత 

అక్క, చంటి బిడ్డను తగలబెట్టి.. ఆత్మాహుతి నాటకం

సాక్షి, చెన్నై: ఆస్తి కోసం తన సొంత అక్క, ఆమె చంటి బిడ్డను నరికి తగల బెట్టడమే కాకుండా, ఆత్మాహుతి చేసుకున్నట్టు నాటకం రక్తి కట్టించిన ఓ కిలాడి చెల్లి కిరాతకం గురువారం వెలుగులోకి వచ్చింది. కళ్లకురిచ్చికి చెందిన చిన్నస్వామికి సుమతి, సుజాత కుమార్తెలు. పెద్ద కుమార్తె సుమతిని సమీప బంధువు ఇలయరాజకు ఇచ్చి చిన్నస్వామి వివాహం చేశాడు. వీరికి శ్రీ నిధి అనే పాప ఉంది.  సుమతికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడంతో ఆమెకు చిన్నస్వామి ప్రాధాన్యత ఇచ్చేవాడు. గతవారం చంటి బిడ్డ సహా సుమతి అగ్నికి ఆహుతైంది. అనారోగ్యంతో ఆత్మాహుతి చేసుకున్నట్టు కేసు ను ముగించారు. పోస్టుమార్టం నివేదికలో సుమతి, బిడ్డ శరీరంపై కత్తి గాట్లు ఉండడంతో అనుమానాలు వచ్చాయి.

పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో కేడీ చెల్లెలు సుజాత గుట్టు రట్టయింది. చిన్నస్వామి పేరిట 20 సెంట్ల స్థలం ఆ గ్రామంలో ఉంది. అక్క కోసం స్థలాన్ని తండ్రి అమ్మేస్తాడో అనే ఆందోళనతో సుజాత ఉంటూ వచ్చింది. ఈ సమయంలో ఇంటికి అక్క రావడంతో తన పథకాన్ని అమలుచేయడానికి సిద్ధమైంది. నిద్రిస్తున్న సుమతి, శ్రీనిధిల్ని కత్తితో నరికి. కిరోసిన్‌ పోసి నిప్పంటించి ఆత్మాహుతి నాటకం రక్తి కట్టించింది.  కత్తి గాట్లు సుజాతను ఊచలు లెక్కించేలా చేసింది. 20 సెంట్ల స్థలం కోసం అక్కను,  బిడ్డను కడతేర్చిన సుజాతపై  గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు