స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి  

12 Jun, 2021 08:00 IST|Sakshi

ఇంటి స్థలవివాదం నేపథ్యంలో మహిళపై దాడి

సాక్షి, కల్వకుర్తి: ఇంటి స్థలవివాదంలో కొందరు ఓ మహిళపై దాడికి పాల్పడి వివస్త్రను చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జేపీనగర్‌ తండాలోని ఓ ప్లాట్‌లో ఇటీవల ఓ మహిళ ఇంటి నిర్మాణం చేపట్టింది. వివాదాస్పదస్థలంలో నిర్మాణం వద్దంటూ తండావాసులు అభ్యంతరం చెప్పగా ఆమె మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసింది. వారి అనుమతితో తిరిగి ఇంటి నిర్మాణం కొనసాగించింది.

ఈ నెల 9న మళ్లీ తండావాసులు వచ్చి అడ్డుకోబోగా ఓ వ్యక్తితో ఆమె వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే 10వ తేదీ మధ్యాహ్నం పలువురు మహిళలు ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని విడిపించేందుకు విఫలయత్నం చేశారు. బాధితురాలిని బైక్‌పై వేరేచోటుకు తరలిస్తుండగా పలువురు తండావాసులు వెంబడించి వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులు ఆమెను రక్షించి ఇంటికి పంపారు. ప్రస్తుతం తండాలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.  
చదవండి: క్షుద్ర పూజల పేరిట నిలువు దోపిడీ

మొబైల్‌ దొంగతనం.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది

మరిన్ని వార్తలు