మల్లేపల్లిలో దారుణం: అత్త అనే కనికరం లేకుండా

9 Oct, 2020 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కన్నతల్లిలా చూసుకోవాల్సిన అత్తను జట్టు పట్టుకొని కోడలు.. విచక్షణారహితంగా కొడుతున్న హృదయ విదారక సన్నివేశం హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో వెలుగు చూసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే..  ఉబైద్ అలీ ఖాన్ అనే వ్యక్తి తల్లి తషనిమా సుల్తానా, తండ్రి అహ్మద్‌ సాహిద్‌ ఖాన్‌తో కలిసి హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు. కాగా ఉబైద్‌ వృత్తిరీత్యా గత పదేళ్లుగా సౌదీలో ఉంటున్నాడు. (చదవండి : చిత్తూరులో సైకో వీరంగం)

ఈ మధ్యనే ఉబైద్‌ మొదటి భార్య చనిపోవడంతో 2019లో ఉజ్మా బేగం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా పెళ్లైన నెల రోజులకే ఉబైద్‌ సౌదీ వెళ్లిపోయాడు. అప్పటినుంచి కోడలు ఉజ్మా బేగం అత్త తషనిమా సుల్తానాను వేధింపులకు గురి చేసేది. కొన్నిరోజుల కిందట హుమయూన్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అత్తా కోడలు ఒకరినొకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన మీద ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఉజ్మాబేగం అత్తను  ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది. మల్లేపల్లిలోని వారి నివాసం నుంచి తషనిమాను జట్టు పట్టుకొని రోడ్డుపై పడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఇంతలో ఉజ్మా బేగం తల్లి కూడా అక్కడికి చేరుకొని కూతురితో కలిసి తషనిమాను విపరీతంగా కొట్టింది.

ఇదంతా గమనిస్తున్న ఒక బాలుడు ఫోన్‌లో  వీడియో తీయబోతుంటే ఉజ్మా బేగం అందుకు అడ్డుకుని, అతడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అయితే ఉజ్మా బేగం చర్యలన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ ఘటన బుధవారం(అక్టోబర్ 8న) చోటుచేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన మల్లేపల్లి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు