మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్‌ 

4 Sep, 2021 06:43 IST|Sakshi

ఉచ్చులోకి దింపి..ఊడ్చేసింది!

యువకుణ్ని ఉచ్చులోకి లాగిన మాయ‘లేడి’ 

బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.23 లక్షలు దండుకున్న వైనం 

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు 

అనంతపురం క్రైం: సామాజిక మాధ్యమాల వినియోగం ఏ స్థాయిలో పెరుగుతోందో.. సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. కొందరు మోసగాళ్లు వాట్సాప్, ఫేస్‌బుక్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వల వేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన  వ్యక్తి.. మాయ‘లేడి’ ఉచ్చులో చిక్కి రూ.23 లక్షలు నష్టపోయాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సదరు వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం అతని సెల్‌ఫోన్‌కు  ‘హాయ్‌’ అంటూ వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. కొత్త నంబర్‌ కావడం, అందులోనూ అందమైన అమ్మాయి ప్రొఫైల్‌ పిక్చర్‌ ఉండడంతో అతను స్పందించాడు.

కొన్ని రోజుల పాటు వారి మధ్య సంభాషణ నడిచింది. తరచూ వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడుకునేవారు.  ఈ క్రమంలోనే మాయ‘లేడి’ నగ్నంగా వీడియో కాల్స్‌ చేసింది. తానేం తక్కువ కాదంటూ అతనూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే ఉచ్చులో చిక్కుకున్నాడు. అతని నగ్న వీడియోలను అధిక సంఖ్యలో సేకరించిన మాయ‘లేడి’ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, బంధువులకు పంపుతానంటూ బెదిరించింది. డబ్బు డిమాండ్‌ చేయడంతో పలు దఫాలుగా రూ.23 లక్షల దాకా సమర్పించుకున్నాడు. అయినప్పటికీ బెదిరింపులు ఆగలేదు. దీంతో విసిగిపోయిన అతను చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

సైబర్‌ మిత్రకు ఫిర్యాదు చేయండి 
సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబర్‌ మోసాలకు గురైన వారు స్థానిక పోలీసు స్టేషన్‌లో గానీ, సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నంబర్‌(9121211100)కు గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవైసీ వెరిఫికేషన్‌ పేరుతో బ్యాంకు, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు వివరాలను ఎవరైనా అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..     
సీక్రెట్‌ యాప్‌తో భార్య ఫోన్‌ ట్యాపింగ్‌.. ఆమెపై నీడలా భర్త

మరిన్ని వార్తలు