రెండు నెలల క్రితమే పెళ్లి..  కోడలు రాకతోనే ప్రమాదం జరిగిందని

10 Jun, 2022 14:16 IST|Sakshi
భర్తతో సంయుక్త (ఫైల్‌) 

సాక్షి, కరీంనగర్‌/ పటాన్‌చెరుటౌన్‌: అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ భీంరెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా సోఫీనగర్‌కు చెందిన సంయుక్త(24) బీటెక్‌ పూర్తి చేసింది. సంయుక్తను నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఉత్తేజ్‌ కుమార్‌కు ఇచ్చి ఏప్రిల్‌ 7న వివాహం చేశారు. ఉత్తేజ్‌ కొండాపూర్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే పెళ్లైన నాలుగు రోజులకే ఇంటి దైవానికి పూజ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో కోడలు రాకతో ప్రమాదం జరిగిందని కొత్తకారు ఇప్పించాలని కోడలిని అత్త వేధించడం మొదలుపెట్టింది. అనంతరం భార్యాభర్తలు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ బంధం కొమ్ము గ్రామం శ్రీదామా హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. సంయుక్తను తరచూ అత్త లావణ్య, మామ పవన్‌కుమార్‌ ఫోన్‌లో పెళ్లి సమయంలో రూ.15లక్షల కట్నం, పది తులాల బంగారం ఇచ్చారని, మరో సంబంధం చేసుకుంటే కట్నం ఎక్కువ వచ్చేదని వేధించేవారు. వీరితో పాటు భర్త కూడా అదనపు కట్నం కోసం వేధించేవాడు.

దీంతో ఉత్తేజ్‌ బుధవారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి సంయుక్త ఉరేసుకుని కనిపించింది. అమీన్‌పూర్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వీరశెట్టి విజయ్‌దర్శన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కూతుర్ని ఆమె భర్త ఉత్తేజ్‌ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని సంయుక్త తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 
చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే?

మరిన్ని వార్తలు