Karimnagar Crime: పండుగపూట విషాదం.. ప్రేమించి పెళ్లి.. 8 నెలలకే!

26 Sep, 2022 13:09 IST|Sakshi
అనూష (ఫైల్‌) 

సాక్షి, రామగుండం(కరీంనగర్‌): పండుగపూట ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పాలకుర్తి మండలం కుక్కలగూడుర్‌ గ్రామంలో విషాదం నింపింది. బసంత్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కందుల శంకరయ్య– కళావతి దంపతుల కూతురు అనూష (24), అదే గ్రామానికి చెందిన మేడం బాపు కుమారుడు మేడం రాకేశ్‌ ప్రేమించుకుని ఎనిమిది నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి.

ఈనేపథ్యంలో తన తల్లిగారింట్లో ఉన్న అనూషను శనివారం రాత్రి రాకేశ్‌ వారి ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో ఎప్పుడో పురుగుల మందు తాగిన అనూష ఆదివారం వేకువజామున బాత్రూంకు వెళ్లి కిందపడిపోయింది. నోటివెంట నురుగులు రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ధర్మారంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బసంత్‌నగర్‌ ఎస్సై మహేందర్‌యాదవ్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని.. 

గ్రామంలో విషాదం
ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజున జరిగిన ఈ ఘటనతో కుక్కలగూడుర్‌ గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలు అనూష తండ్రి కందుల శంకరయ్య ఏడాదిక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అనూష ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

మరిన్ని వార్తలు