నా భర్త పెద్ద సైకో!: లేఖ రాసి.. హెడ్‌ కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య

29 Nov, 2022 08:06 IST|Sakshi

నస్పూర్‌(మంచిర్యాల): భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీసీ నస్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవికుమార్, మృతురాలు రాసిన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకా రం పట్టణ పరిధిలోని నాగార్జున కాలనీలో నివాసం ఉండే ఆకుదారి కిష్టయ్య తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

అతనికి భార్య వనిత (35) కూతుర్లు వర్షశ్రీ, చరితశ్రీ, కుమారుడు కృష్ణవంశీ ఉన్నారు. కిష్టయ్య భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతుండేవాడు. సోమవారం కిష్టయ్య పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి వనిత ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు.

వాగ్వాదానికి దిగిన స్థానికులు
వనిత ఆత్మహత్యకు భర్త కిష్టయ్యనే కారణమని, అతడిని ఇక్కడికి తీసుకురావాలని స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకున్నారు. ఎస్సై రవి కుమార్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌ వారికి సర్దిచెప్పారు.

మరిన్ని వార్తలు