భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో..

22 Feb, 2022 08:14 IST|Sakshi
రేవతి(ఫైల్‌)

సాక్షి, కుషాయిగూడ: అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక బీదర్‌కు చెందిన మచ్ఛీంద్రా రాథోడ్, కుటుంబ సభ్యులతో కలిసి ఏడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఏఎస్‌రావునగర్, సాయినాథపురంలో నివాసముంటూ స్వీట్‌కాన్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ప్రియాంక జాదవ్‌ (20)ఉన్నారు. కూతురికి 2020 మార్చిలో ఏఎస్‌రావునగర్‌లోనే ఉంటున్న సచిన్‌జాదవ్‌తో వివాహం జరిగింది. వారికి 13 నెలల పాప ఉంది. కొంత కాలం సజావుగా సాగిన వారి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ భార్యను అనుమానించడం, వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టాడు.

భర్త వేధింపులు భరించలేని ప్రియాంక, తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా పలుమార్లు సర్ధి చెప్పినా అ తని తీరు మారలేదు. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఈ నెల 20న ప్రియాంక వారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. కూ తురుకి మళ్లీ సర్ధిచెప్పి మరుసటి రోజు సోదరుడు సంతోష్‌తో కలిసి ప్రియాంకను అత్తరింటికి  పంపించారు. వారిని చూసిన సచిన్‌ దురుసుగా ప్రవర్తించాడు. కాసేపటి తర్వాత సంతోష్‌ ఇంటికెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఒంటరిగా ఎందుకు వదిలివచ్చావని, చిన్న కొడుకు సందీప్‌ను కూతురు ఇంటికి పంపించాడు. సందీప్‌ అక్కడికి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎంతకీ తీయకపోవడంతో కిటికీ లోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: స్వగ్రామానికి చెందిన యువతితో ప్రేమ.. మరొకరిని ప్రేమిస్తోందని తెలిసి..

మనోవేదనకు గురై.. 
అల్వాల్‌: మానసిక ఒత్తిడి, మనోవేదనకు గురై గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ వివరాల ప్రకారం.. భూదేవినగర్‌కు చెందిన రేవతి (28) మల్కాజిగిరి సర్కిల్‌ గౌతంనగర్‌కు చెందిన కిరణ్‌తో గతేడాది వివాహం జరిగింది. గత కొంతకాలంగా రేవతి తల్లి లత తలకు తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతోంది. ఇటీవల రేవతి భూదేవినగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి మానసికంగా కుంగిపోయి ఒత్తిడి గురైంది.  ఈ నెల 20న రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో లోపలికెళ్లి చూడగా రేవతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

మరిన్ని వార్తలు