కట్నం వేధింపులకు ముగ్గురి బలి 

19 Mar, 2022 02:38 IST|Sakshi
భర్తతో రేఖ, ఆత్మహత్యకు పాల్పడిన చెరువు

భర్త హింస తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి

గంభీరావుపేట (సిరిసిల్ల): అదనపు కట్నం.. వేధింపులకు మూడు ప్రాణాలు బలయ్యాయి. ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం కొత్తపల్లిలో విషా దం నింపింది. ముగ్గురి మృతదేహాలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. గంభీరావుపేట మండలం లింగ న్నపేటకు చెందిన రేఖ (28)కు కొత్తపల్లికి చెందిన వరుకుటి రాజు తో ఐదేళ్ల క్రితం వివాహమైంది.

రేఖ తల్లిదండ్రులు దాదాపు రూ.9 లక్షల కట్నం, పది తులాల బంగారం, ఇతర లాంఛానాలతో పెళ్లి చేశారు. అయితే రాజు అదనపు కట్నం కావాలని రేఖను తరచూ శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. నెల క్రితం రేఖ తల్లిదండ్రులు రూ.లక్ష ఇవ్వగా, మూడు రోజుల క్రితం ద్విచక్రవాహనం కొనిచ్చారు. అయినా.. అతను రేఖను వేధించడం మానలేదు.

దీంతో మానసికంగా కుంగిపోయిన రేఖ.. భర్త హింస ను తట్టుకోలేక తన పిల్లలు అభిజ్ఞ (3), హన్సిక (ఐదు నెలలు)లతో స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. రేఖ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు