తెలంగాణలో ఒకరిని.. ఆంధ్రాలో మరొకరిని వివాహం

14 Jan, 2021 12:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వెలిగండ్ల(ప్రకాశం జిల్లా): బేల్దారి పనికి తెలంగాణ రాష్ట్రం వెళ్లి అక్కడ ఒక మహిళతో పరిచయం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసి చెప్పా పెట్టకుండా ఆంధ్రాకు వచ్చి మరొకరిని వివాహం చేసుకున్నాడంటూ తెలంగాణకు చెందిన మహిళ ఓ యువకుడిపై వెలిగండ్ల పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. ఏఎస్‌ఐ ముస్తాఫా కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం బోయినపల్లి మండలం వర్ధపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వనజకు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తుమ్మల మహేష్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అనారోగ్యంతో భర్త మహేష్‌ చనిపోయాడు. (చదవండి: ఏడేళ్ల బాలికపై బాలుడి లైంగికదాడి..)

వెలిగండ్ల మండలం గండ్లోపల్లికి చెందిన జొన్నలగడ్డ నిరీక్షన్‌ బేల్దారి పని చేసుకునేందుకు వర్దపల్లి వెళ్లాడు. అక్కడ వనజతో పరిచయం ఏర్పడింది. వనజను వివాహం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసి చెప్పాపెట్టకుండా ఏపీకి వచ్చి గండ్లోపల్లిలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి ఆమె నిరీక్షన్‌కు ఫోన్‌ చేయగా తాను వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నానని, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించినట్లు ఫిర్యాదులో వనజ పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ముస్తఫా తెలిపారు.(చదవండి: లిఫ్ట్‌ ఇచ్చి మహిళపై అఘాయిత్యం)

మరిన్ని వార్తలు