వేగంగా వస్తున్న రైలు.. అక్కను కాపాడి.. చెల్లెలు దుర్మరణం

21 Dec, 2022 08:37 IST|Sakshi

ఖమ్మం క్రైం: శరవేగంగా వస్తున్న రైలును గమనించని అక్కను కాపాడే క్రమంలో చెల్లెలు మరో రైలు ఢీకొని దుర్మరణం పాలైంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటనపై జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ అందించిన వివరాలివి.

ఖమ్మం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన పోతునూక యశోద (37) తన అక్క వరలక్ష్మి, మరో మహిళతో కలిసి కమాన్‌బజార్‌లో మంగళవారం షాపింగ్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు వరలక్ష్మి ఓవర్‌ బ్రిడ్జి కింద వెంకటగిరి రైలు గేటుదాటుతోంది. అదే సమయంలో ఎగువ లైన్‌లో రైలు అతివేగంగా వస్తున్న విషయాన్ని గమనించిన ఆమె చెల్లెలు యశోద.. అక్క వరలక్ష్మిని వెనక్కి లాగింది. కానీ మరోవైపు డౌన్‌లైన్‌లో వస్తున్న రైలును గమనించకపోవటంతో యశోదను ఢీకొనగా.. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది.

తన ను కాపాడబోయి చెల్లెలు కళ్ల ముందే మృతి చెందటంతో అక్క వరలక్ష్మి గుండెలు పగిలేలా రోదించడం కలిచివేసింది. యశోదకు భర్త రమేశ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు మార్చురీకి తరలించగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాస్కర్‌రావు తెలిపారు.
చదవండి: కిచెన్‌ రూమ్‌ తాళం చెవి ఇవ్వలేదని.. భార్యపై కత్తెరతో దాడి

మరిన్ని వార్తలు