నాలుగేళ్ల ప్రేమ..పెళ్లి వద్దంటూ.. సంబంధాలు చెడగొడుతూ చివరికి..

19 Mar, 2022 19:37 IST|Sakshi
మనీష(ఫైల్‌ ఫొటో)

నల్లగొండ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలంలోని బొక్క ముంతలపాడు గ్రామానికి చెందిన మనీష(25) తల్లి నాగేంద్రమ్మతో కలిసి పట్టణంలోని సాగర్‌ రోడ్డులో అయ్యప్పగుడి సమీపంలో నివాసం ఉంటున్నారు.

నాగేంద్రమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ కుమార్తెను ఎమ్మెస్సీ వరకు చదివించింది. సమీప బంధువు అయిన మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డి గూడేనికి చెందిన బోదల రాజేశ్, మనీషలు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మనీష కుటుంబసభ్యులకు రాజేశ్‌ భరోసా ఇచ్చాడు. అయితే ఆలస్యం అవుతుండడంతో పెళ్లి విషయమై స్పష్టత ఇవ్వాలని మనీష కుటుంబ సభ్యులు తమ ఇంటికి పిలిచి అడిగారు.

తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తానని కొంతసమయం పడుతుందని చెప్పాడు. దీనికితోడు ఇతర సంబంధాలు చూస్తే చెడగొడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తల్లి ఇంట్లో లేని సమయంలో మనీష చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వెళ్లిన తల్లి తలుపు కొట్టినా తెరవక పోవడంతో సమీపంలోని వారితో కలిసి డోర్‌ను తొలగించి వేలాడుతున్న కూతురు మృతదేహాన్ని కిందికి దింపారు.

స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. విషయం పోలీసులకు చేరడంతో తల్లిని వివరాలు అడిగి తెలుసుకోగా పెళ్లి విషయం ప్రస్తావించానని, రాజేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లి సంబంధాలను చెడగొట్టడంతోపాటు అతడు పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అయితే తన కమార్తె ఆత్మహత్యకు రాజేశ్‌యే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌ టౌన్‌ ఎస్సై సందీప్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు