ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
వివాహిత బలవన్మరణం
తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు
సాక్షి, దండేపల్లి (మంచిర్యాల): కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన దండేపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. దండేపల్లికి చెందిన ఎనగందుల సత్యనారాయణకు, గద్దె రాగడికి చెందిన జ్యోతి(30)తో 2012లో వివాహమైంది. వీరికి శశ్మిత, హర్షిణి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
అయితే మృతురాలు జ్యోతికి తంబాకు తినే అలవాటు ఉంది. దీంతో దాన్ని మానుకోవాలని భర్త, అత్త చెబుతూ వస్తున్నారు. ఈ విషయంంలో కుటుంబంలో మనస్పర్థాలు ఏర్పడ్డాయి. తంబాకు విషయంలోనే శనివారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన జ్యోతి ఆదివారం పిల్లలను పక్కింటికి పంపి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు రంజిత్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు.
తల్లిప్రేమకు దూరమైన చిన్నారులు..
జ్యోతి మరణంతో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఉరితో వేలాడుతున్న తల్లిని చూసి ఇద్దరు చిన్నారులు అమ్మా.. అని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.