వైద్యుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

8 Aug, 2020 16:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే కీచకుడి అవతారం ఎత్తాడు. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ నాంచారయ్యపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి.. డాక్టర్‌ వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది. రాత్రివేళలో ఫోన్లు చేయడంతో పాటు, తన పర్సనల్‌ గదికి రావాలంటూ నాంచారయ్య ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఫోన్‌కాల్‌,వీడియో రికార్డింగ్స్‌ను పోలీసులకు అందజేసింది. అలాగే ఆసుపత్రిలో పర్సనల్‌ రూమ్‌కు రావాలంటూ నాంచారయ్య ఇచ్చిన తాళాలను కూడా బాధితురాలు పోలీసులకు అందజేసింది. నాంచారయ్య పై 354 ఏ అండ్ డీ, 506, 509 ఐపీసీ, సెక్షన్ 67 ఏ ఐ టీ యాక్ట్ కింద దిశ పోలీసులు కేసులు నమోదు చేశారు.

కోరిక తీర్చలేదని..
బాధితురాలు ‘సాక్షి’తో మాట్లాడుతూ రెండు నెలలుగా సూపరిండెంట్‌ నాంచారయ్య వేధిస్తున్నారని, తన సెల్‌కు అసభ్యకర వీడియోలు పంపేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తన కోరిక తీరిస్తే ఉద్యోగాన్ని పర్మినెంట్‌ చేస్తానన్నాడు. రకరకాలుగా డ్యూటీ లు మార్చి బెదిరించారు. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ తో విసిగించే వారు. తనకు లొంగలేదన్న కోపంతో కాంట్రాక్టర్ కి చెప్పి ఉద్యోగం లో నుంచి తొలగించారు. న్యాయం కోసం దిశా పోలీసులను ఆశ్రయించాను. నాంచారయ్యపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి. ఏ అదరువు లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని’ బాధితురాలు కోరింది.

మరిన్ని వార్తలు