బాధితురాలిని వీడియో తీస్తూ జనాలు బిజీ

18 Aug, 2020 12:33 IST|Sakshi

లక్నో: దాదాపు 20 ఏళ్లు ఉంటాయి ఆమెకు. సోమవారం సాయంత్రం కాలువ దగ్గర పడి ఉంది. ముఖం, గొంతు మీద పదునైన ఆయుధంతో దాడి చేశారు. విపరీతంగా రక్తం పోతుంది. సాయం చేసే వారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. ఇక్కడ దారుణమైన విషయం ఎంటంటే దాదాపు 10-20 మంది ఆమె చుట్టూ గుమికూడారు. చోద్యం చూస్తూ.. సెల్‌ఫోన్‌లలో వీడియో తీయడంలో మునిగపోయారు. ఒక్కరు కూడా బాధితురాలిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం మాత్రం చేయలేదు. మరి కొందరు మూర్ఖులు ఆమెను ప్రశ్నలతో మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోలుకున్న తర్వాత ఆమె తన వివరాలు వెల్లడించింది. 

మీరట్‌కు చెందిన బాధిత యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంది. దాంతో కుటుంబ సభ్యులు ఆమె మీద ఇంత దారుణంగా దాడి చేశారని తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి.. బాధితురాలి సోదరుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘనట జరిగిన నాడే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై నేరాలను తగ్గించడం కోసం ‘ఉమెన్ అండ్ చైల్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్’ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అడిషనల్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకుకు చెందిన అధికారి ఈ విభాగానికి హెడ్‌గా ఉంటారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. (80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం)

ఇక మీరట్‌ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ.. స్థానికలు ఎవరైనా సరే ఇలా ప్రమాదంలో ఉన్న బాధితులను గుర్తించినప్పుడు వీడియోలు తీయడం మీద కాక వారిని ఆస్పత్రికి చేర్చే అంశంపైన దృష్టి పెడితే మంచిదని కోరారు. బాధితుల విషయంలో ‘గోల్డెన్‌ అవర్‌’ అనేది చాలా కీలకమైన సమయం అన్నారు. బాధితులను ఆస్పత్రికి చేర్చేవారిని ప్రశ్నించవద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు పోలీసులు. కాబట్టి ఎవరైనా సరే బాధితులను గుర్తిస్తే.. తాము వచ్చే వరకు వేచి ఉండకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కొన్ని నెలలుగా యూపీలో మహిళలు, బాలికలపై నేరాలు విపపరీతంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇద్దరు మృగాళ్లు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడమే కాక హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు