భర్త ఇంటి ముందు యువతి ధర్నా

10 Jan, 2022 09:06 IST|Sakshi
అత్తగారింటి ముందు చంటి బిడ్డతో ధర్నా చేస్తున్న అమ్ము

సాక్షి, తిరువణ్ణామలై(తమిళనాడు): పోలూరు సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న భర్త ఏడాదికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాధిత యువతి చంటి బిడ్డతో అత్తగారింటి ముందు ధర్నాకు దిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని పాపంబాడి గ్రామానికి చెందిన శంకర్‌ కుమారుడు పూఅరసన్‌(22), చెన్నైలో మినీ వ్యాన్‌ నడుపుతున్నాడు. ఆ సమయంలో కల్లకుర్చికి చెందిన అమ్ము(22) తో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు.

అనంతరం ఇరు కుటుంబ సభ్యులు సమ్మతించడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు.  ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం పూఅరసన్‌ ఓ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న అమ్మును అమ్మగారింటికి పంపి వేశారు. అనంతరం  భర్త కుటుంబ సభ్యుల మధ్య  ఘర్షణ చోటు చేసుకోవడంతో అమ్ము తన వివాహం సమయంలో వేసిన బంగారం, వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరింది.

అయితే ఇందుకు అత్తగారింటిలో అంగీకరించక పోవడంతో ఆమె ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు చెన్నై హైకోర్టులోను ఫిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టేందుకు యత్నించగా ఇంటికి తాళం వేసి అత్తింటి వారు పరారయ్యారు. దీంతో అమ్ము శనివారం అత్తింటి ముందు చంటి బిడ్డతో ధర్నాకు దిగింది. పోలీసులు ఆమెతో చర్చించి ధర్నాను విరమింప జేశారు. 

చదవండి: నీ అశ్లీల వీడియో లీక్‌ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు!

మరిన్ని వార్తలు