మరో ఖా‘కీ’చకం

25 Feb, 2021 06:33 IST|Sakshi

ఐపీఎస్‌కు డీజీపీ హోదా అధికారి వేధింపులు

సాక్షి, చెన్నై: హోం శాఖలో మరో ఖా‘కీ’చకం చర్చకు దారి తీసింది. మహిళా ఐపీఎస్‌ను డీజీపీ హోదా అధికారి వేధింపులకు గురిచేయడం రాజకీయంగా సైతం దుమారాన్ని రేపింది. దీంతో విచారణకు కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీని ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని పోలీసు విభాగంపై ఇటీవల కాలంగా ఆరోపణలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఇందులో లైంగిక వేధింపులు ఎక్కువగానే ఉన్నాయి.

కొంత మంది మహిళా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా, మరెందరో బయటకు చెప్పుకోలేక తమలో తాము కృంగిపోతున్నారు. ఫిర్యాదులు చేసుకున్నా ఫలితం శూన్యం. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఎస్పీ స్థాయి అధికారినికి ఐజీ స్థాయి అధికారి వేధింపులు ఇవ్వడం, విశాఖ కమిటీ రంగంలోకి దిగినా, చివరకు ఆ విచారణ తుంగలో తొక్కబడడమే. ఈ పరిస్థితుల్లో డీజీపీ హోదా కల్గిన అధికారి ఐపీఎస్‌ అధికారిని తన కారులో ఎక్కమని చెప్పి, కొంత దూరం వెళ్లినానంతరం డ్రైవర్‌ను కిందకు దించేసి మరీ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు, లైంగిక వేధింపులు ఇచ్చినట్టు రెండు రోజులుగా ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తూ వచ్చింది.

ఐఏఎస్‌ నేతృత్వంలో రంగంలోకి..  
ఈ సమాచారం బుధవారం రాజకీయవివాదంగా మారింది. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. ఆ మహిళా ఐపీఎస్‌ అధికారి ఇప్పటికే  డీజీపీ త్రిపాఠికి ఫిర్యాదు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వేధింపులపై విచారణకు కమిటీని నియమిస్తూ హోంశాఖ కార్యదర్శి ప్రభాకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి పోలీసు బాసుల నేతృత్వంలో కమిటీ రంగంలోకి దిగాల్సి ఉంది. వేధింపులు ఇచ్చిన అధికారి డీజీపీ స్థాయి వ్యక్తి కావడంతో ఐఏఎస్‌ అధికారి జయశ్రీ రఘునందన్‌ నేతృత్వంలో ఆరుగురితో కూడిన కమిటీ రంగంలోకి దించారు. ఈ కమిటీలో అదనపు డీజీపీ సీమాఅగర్వాల్, ఐజీ అరుణ్, డీఐజీ చాముండేశ్వరి, ఐపీఎస్‌ రమేష్‌బాబు, మహిళా స్వచ్ఛంద సేవకురాలు లోరెటా జోనా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ స్థాయి అధికారిని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి:
ఘట్‌కేసర్‌ విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌  
మాయలేడి: ఇంత పనిచేసిందా?

మరిన్ని వార్తలు