అబ్బాయికి 20.. ఆమెకు 32.. ‘ప్రేమ’ ఎంత పని చేసిందంటే!

21 Feb, 2022 19:31 IST|Sakshi

ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారన్న విషయం చాలా సార్లు వింటుంటాం. అయితే తల్లిదండ్రులను కాదని ఇంటి నుంచి పారిపోతారు. ఎవరికి కంట కనబడకుండా వారి ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచుతారు. ప్రేమించిన వ్యక్తి ముఖం చాటేస్తే.. ఇంటి ముందు ధర్నాకు దిగుతారు. అయితే ఇక్కడ ఓ ఘటన మాత్రం వాటికి భిన్నంగా చోటు చేసుకుంది. అసలు విషయం తెలిసిన  పోలీసులే ఆశ్చర్యపోయారు.

తన ప్రియుడు కొన్ని నెలల నుంచి మాట్లాడటం లేదని ఆ ప్రేయసి ఏకంగా ప్రియుడి తమ్ముడినే కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఛతారీ పోలీస్ స్టేషన్ పరిధితో చోటు చేసుకుంది. పక్కపక్కనే ఉన్న గ్రామాలకు చెందిన 20 ఏళ్ల హిరాలాల్‌, 32 ఏళ్ల పింకీ ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి కొన్ని రోజులు  చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.

అయితే కొన్ని నెలల కిందట హిరాలాల్‌కి ఉద్యోగం రావటంతో అతను గుర్‌గావ్‌కి వేళ్లాడు. అక్కడే ఉద్యోగం చేసుకుంటూ పింకీని దూరం పెట్టాడు. అప్పటి వరకు తనతో సన్నిహితంగా ఉన్న హిరాలాల్‌ను ఎలాగైనా  కలవాలనుకుంది పింకీ. అందుకోసం ఏకంగా ఓ కిడ్నాప్‌ ప్లాన్‌ వేసింది. ఆరేళ్ల హిరాలాల్‌ తమ్ముడు డోరిలాల్‌ను పింకీ తన అల్లుడి సాయంతో కిడ్నాప్‌ చేసింది. అక్కడితో ఆగకుండా డోరిలాల్‌ను ​కిడ్నాప్‌ చేసినట్లు తన ప్రియుడు హిరాలాల్‌కు ఫోన్‌ చేసి తెలిపింది.

దీంతో కంగారుపడిన హిరాలాల్‌, అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులకు అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు. హిరాలాల్‌ పక్క గ్రామానికి చెందిన పింకీనే డోరిలాల్‌ను కిడ్నాప్‌ చేసినట్లు గుర్తించారు. 

పింకీ ఫోన్‌ ట్రేస్‌ చేసి బాలుడిని సురక్షితంగా పట్టుకున్నారు. పింకీ పోలీసులు ముందు తన చేసిన నేరాన్ని ఒప్పుకుంది. ఈ ఘటనలో పింకీతో పాటు ఆమె అల్లుడిని, పింకీ ప్రియుడు హిరాలాల్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలుడు డోరిలాల్‌ను.. పోలీసులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు