భర్తను హత్య చేసిన భార్య

7 Jan, 2021 10:14 IST|Sakshi

గోర్లగుట్టలో ఘటన

సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): తాళికట్టిన భర్తనే భార్య కడతేర్చింది. గాఢ నిద్ర లో ఉన్న అతడిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి హతమార్చింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గోర్లగుట్ట గ్రామానికి చెందిన రామదాసు, సుంకులమ్మ కుమారుడు వడ్డె చిన్న ఆంజనేయులు(35)కు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన నరసింహుడు, లక్ష్మిదేవి కూతురు ధనలక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తెలు పూజిత, వర్షిణి, కుమారుడు హేమంత్‌ ఉన్నారు.

పాలీస్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కాగా కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వడ్డె ఆంజనేయులు తాగుడుకు బానిసై వేధించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో మంగళవారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తను భార్య గొడ్డలితో విచక్షణారహితంగా నరికి హత్య చేసింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కాగా ఈ విషయం పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సీఐ కేశవరెడ్డి, ఎస్‌ఐ సురేష్‌ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి: మహిళల భద్రత మా బాధ్యత)

మరిన్ని వార్తలు