వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి!

16 Dec, 2022 18:59 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన పది రోజుల తర్వాత వెలుగు చూసింది. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ రాంలాల్‌ వివరాలను వెల్లడించారు. మండలంలోని పెద్దచింతకుంట గ్రామానికి చెందిన మరాఠి శ్రీనివాసులు(39) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్, భార్య సుజాత వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డితో నాలుగేళ్ల క్రితం సుజాతతో పరిచయం ఏర్పడింది.

ఈ విషయంపై అనుమానం వచ్చిన భర్త పలుమార్లు భార్యను నిలదీశాడు. పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. అయినా గుట్టు చప్పుడుగా వీరు తమ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో, పద్ధతి మార్చుకోవాలని భార్యతో తరచుగా గొడవ పడేవాడు. భర్త గొడవ పడుతున్న విషయాన్ని సుజాత ప్రియుడికి తెలిపింది. ఇరువురు కలిసి శ్రీనివాసులు హత్యకు పథకం వేశారు. ఈ నెల 6న గ్రామంలో జాతర ఉందని ఇంటిని శుద్ధి చేసి భర్తను నమ్మించి ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి మద్యం సేవించారు.

శ్రీనివాసులు మద్యం మత్తులోకి జారుకోగా, రాత్రి 12 గంటల సమయంలో భార్య తన భర్త ముఖంపై ఊపిరి ఆడకుండా గట్టిగా దిండు పెట్టగా, ప్రియుడు కరుణాకర్‌రెడ్డి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకొని హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. భార్యపై అనుమానంతో మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో నిజాలు తేలాయని సీఐ తెలిపారు. నిందితులు ఇద్దరిని గ్రామంలోనే అరెస్ట్‌ చేసి నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు.  
చదవండి: ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్‌ ట్విస్ట్‌

మరిన్ని వార్తలు