కారణం ఒక్కటే.. ఇద్దరు మహిళల అదృశ్యం

2 Jul, 2021 14:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): మండలంలోని శాలిగౌరారం, ఆకారం గ్రామాల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైన సంఘటనలు గురువారం వెలుగులో వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన ఆడెపు సంతోష(30) భర్త యాదగిరితో గొడవపడి ఆరు నెలల క్రితం మండలంలోని ఆకారం గ్రామంలో తల్లిగారింటికి వచ్చింది. తల్లిగారింట్లో ఉంటున్న సంతోష గతనెల 28న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిగారి కుటుంబీకులు బంధువుల ఇళ్లతోపాటూ చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో గురువారం ఆమె తండ్రి ఇంద్రకంటి యల్లయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అదేవిధంగా కేతెపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన కొండ అనిత(24) భర్త సతీష్‌తో గొడవపడి మూడు నెలల నుంచి శాలిగౌరారంలోని తల్లిగారింటివద్ద ఉంటుంది. ఆమె గతనెల 30న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిగారి కుటుంబీకులు బంధువుల ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో గురువారం ఆమె తండ్రి బొడ్డు అంజయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వేర్వేరు గ్రామాల్లో జరిగిన మహిళల అదృశ్యంపై వారి తండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: దారుణం: ప్రేమ పేరుతో మైనర్‌ బాలికపై 9 నెలలుగా..

మరిన్ని వార్తలు