మంచిజీతం ఉంటుందని ఆశపడితే.. అమ్మేశారు!

8 Feb, 2022 10:47 IST|Sakshi

ఆర్మూర్‌టౌన్‌(నిజామాబాద్‌): ఆమె ఇళ్లలో పనిచేసి జీవితాన్ని వెళ్లదీసేది. మస్కట్‌లో పని అంటే... మంచిజీతం, కుటుంబం బాగుంటుందని ఆశపడింది. తీరా వెళ్లాక అదో నరకకూపం అని ఆమెకు అర్థమయింది. తన వేదననంతా వీడియో ద్వారా కుటుంబంతో పంచుకుంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్‌కు చెందిన అర్జున్, లక్ష్మి బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్ట ణానికి వలస వచ్చారు. 

అక్కడ లక్ష్మి ఇళ్లలో పనిచేసేది. నిజామాబాద్‌కు చెందిన సల్మా అనే ఏజెంటు మస్కట్‌లో మంచి పని ఉందని లక్ష్మికి చెప్పింది. సల్మా మాటలను నమ్మిన లక్ష్మి సరేనంది. బతుకు బాగుపడుతుందనే ఆశతో మస్కట్‌కు వెళ్లింది. అయితే ఏజెంట్‌ సల్మా, లక్ష్మిని మస్కట్‌లో విక్రయించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడ తనను రెండు నెలలుగా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని లక్ష్మి తమకు వీడియో పంపిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు నిజామాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు. 

మరిన్ని వార్తలు