వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

18 Jul, 2021 20:16 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ (వరంగల్‌): వరకట్న వేధింపులు, సూటిపోటి మాటలు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మానుకోట జిల్లా కేంద్రంలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన గందె శ్రీనివాస్‌ – కళావతి దంపతుల పెద్ద కుమార్తె అనూష(26)ను మహబూబాబాద్‌కు చెందిన భూముల వెంకన్న– వెంకటమ్మ రెండో కుమారుడు రవిచందర్‌కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు.

వివాహ సమయంలో ఆరు తులాల బంగారం, రూ.10 లక్షల నగదు కట్నం రూపంలో ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే రవిచందర్‌ కరోనా కారణంగా ఇంటి వద్ద నుంచే వర్క్‌ ఫ్రం హోమ్‌ పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలే కావడంతో మరో రూ.10 లక్షల అదనపు కట్నంతేవాలని రవిచందర్‌ భార్య అనూషను వేధించడంతోపాటు సూటిపోటి మాటలతో మనోవేధనకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మృతదేమాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించగా తహసీల్దార్‌ ఎం.రంజిత్‌కుమార్, సీఐ రవికుమార్‌ వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ ఇన్‌చార్జ్‌ సీఐ రవికుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు