రైల్వేస్టేషన్‌లో అత్యాచారానికి గురైన యువతి అస్థిపంజరం

13 Apr, 2021 13:24 IST|Sakshi

సాక్షి, టీ.నగర్‌: చెన్నై రైల్వేస్టేషన్‌లో ఓ యువతి అస్థిపంజరాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె అత్యాచారానికి గురై హత్య గావించబడినట్లు తెలియడంతో తీవ్ర విచారణ జరుపుతున్నారు. చెన్నై కోట్టూర్‌పురం పోలీసులు ఆదివారం గంజాయి ముఠాకు చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతూ వచ్చారు. మత్తులో జోగుతున్న వారు సంచలన సమాచారం అందించారు. మూడు నెలల క్రితం ఓ యువతి చెన్నై గ్రీన్‌వేస్‌రోడ్డు రైల్వేస్టేషన్‌లో రాత్రి అత్యాచారానికి గురై హత్య గావించబడినట్లు, ఆ యువతి మృతదేహాన్ని రైల్వేస్టేషన్‌లోని ఒక గోదాములో విసిరేసి నిందితులు పరారైనట్లు, దీన్ని తాము స్వయంగా చూసినట్లు ముఠా వ్యక్తులు తెలిపారు. దీంతో పోలీసులు గ్రీన్‌వేస్‌రోడ్డు రైల్వేస్టేషన్‌ గోదాములో తనిఖీ చేశారు.

ఈ గోదాములో ఒక మానవ అస్తిపంజరం లభించింది. దీన్ని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. గంజాయి ముఠా వద్ద తీవ్ర విచారణ జరపగా అత్యాచార ముఠాకు చెందిన ఒక వ్యక్తి సమాచారం లభించింది. ఆ వ్యక్తి గత మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది పోలీసులను దిగ్భ్రాంతి కలిగించింది. అడిషనల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కన్నన్‌ ఉత్తర్వుల మేరకు జాయింట్‌ కమిషనర్‌ బాలకృష్ణన్, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్యాంసన్‌ పర్యవేక్షణలో కోట్టూర్‌పురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడికాగలవని సమాచారం.

చదవండి: ప్రాణాలు బలిగొన్న కులాంతర ప్రేమ

మరిన్ని వార్తలు