యాభై వేలకు కన్న బిడ్డను అమ్మేసి.. కిడ్నాప్‌ డ్రామా..!

12 Jul, 2021 19:16 IST|Sakshi

లక్నో: బ్రహ్మదేవుడు తన సృష్టిలో ఎన్నింటినో సృష్టించాడు. కానీ ఆయనకు ఎక్కడో లోటు అనిపించింది. దాన్ని పూడ్చడానికి అమ్మని సృష్టించాడంటారు.  “అమ్మ” అనే పదానికి అర్థం చెప్పటం చాలా కష్టం. అమ్మను మించిన శక్తి మరొకటి లేదు. అలాంటి అమ్మ తనానికి మచ్చ తెచ్చింది ఓ మహిళా.. తన బిడ్డను రూ. 50 వేలకు అమ్మి.. కిడ్నాప్‌ కథను అల్లింది. వివరాల్లోకి వెళితే.. గోరఖ్‌ నాథ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే ఇలహిబాగ్‌ ప్రాంతంలో నివసిస్తున్న సల్మా ఖాటూన్‌ అనే మహిళ తన కుమారుడు కనిపించడం లేదని ఆదివారం పోలీసులకు సమాచారమిచ్చింది. రసూల్పూర్ ప్రాంతంలోని ఓ వివాహ వేడువ వద్ద తన కొడుకును తన నుంచి లాక్కొని ఎరుపు చీర ధరించిన మహిళ ఎస్‌యూవీలో పరారైనట్లు పోలీసులకు తెలిపింది.

దీంతో ఎస్పీ సోనమ్‌ కుమార్‌తో పాటు పోలీస్‌ బృందం సంఘటన స్థలానికి చేరుకుని శిశువు కోసం అన్వేషణ ప్రారంభించారు. అయితే బాలుడి తల్లి కిడ్నాప్‌ కథను మార్చి మార్చి చెప్పడంతో.. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఖాటూన్ తన కొడుకును మరొక మహిళకు అప్పగించి, ఇ-రిక్షాలో వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో​ ఆ బాలుడి తల్లిని, కొనుగోలు చేసిన మహిళను ప్రశ్నించి ఇద్దరిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు