దేశ రాజధానిలో దారుణం

1 Mar, 2021 00:49 IST|Sakshi

మహిళను కత్తితో పొడిచిన చైన్‌స్నాచర్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దోపిడీ యత్నాన్ని అడ్డుకున్న ఓ మహిళ దుండగుడి కత్తిపోట్లకు బలైంది. వాయవ్య ఢిల్లీలోని ఆదర్శ్‌ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమ్రాన్‌ కౌర్‌ (25) శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తన రెండేళ్ల కుమార్తె, తల్లితో కలిసి మార్కెట్‌ నుంచి ఇంటికి వెళుతోంది. తమ ఇంటికి సమీపంలో ఉండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు సిమ్రాన్‌ మెడలో గొలుసును లాక్కునేందుకు యత్నించాడు. ఆమె అప్రమత్తమై, అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాటలో ఆ దుండగుడు కిందపడి పోయాడు.

అనంతరం తిరిగి లేచి, తన వద్ద ఉన్న కత్తితో ఆమె పొట్టలో పొడిచి పరారయ్యాడు. అక్కడికి సమీపంలోనే ద్విచక్ర వాహనంతో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి మాయమ య్యాడు. తీవ్రంగా గాయపడిన సిమ్రాన్‌ను ఇరుగు పొరుగువారు ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దుండగులను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ ఉషా రంగ్నానీ తెలిపారు. ఈ ఘటనతో ఇద్దరు వ్యక్తులకు ప్రమేయం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు